Thursday, March 28, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-9


అనాదినుంచీ మానవుడు సుఖాన్వేషణలోనే ఉన్నాడు. దానికోసం తిరుగని చోటులేదు. కన్పించిన వారినల్లా అర్ధిస్తూ కాలం గడుపుతున్నాడు. అజ్ఞానంచేత దారి కన్పించడం లేదు. మనస్సు ఎపుడూ బహిర్ముఖంగానే తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆవేశాలకూ, ఆవేదనలకూ , సుఖదుఃఖాలకూ లోనవుతూన్న మనస్సు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. మహారాజులా ఉండవలసిన మనం , మనసుకు బానిసగా మారితే  అది నియంత అయ్యికూర్చుంటోంది.  మనలని జీవచ్చవంలా నడిపిస్తోంది. కోరికలతోనో, ఆదర్శంతోనో, అహంకారంతోనో , బాంధవ్యాలతోనో  మనం జీవితంలో  రాజీపడి, జీవితాన్ని ఈడ్చుకుంటూ బ్రతుకుతున్నామే తప్ప, నిజానికి జీవిత మాధుర్యాన్ని అనుభవించడం లేదు. అంటే జీవితాన్ని జీవించడం లేదు. జాగరూకతతో మనం దాన్నిగమనిస్తే, అదెలా ప్రవర్తిస్తుందో అవగాహన కల్గితే, నెమ్మదిగా దానితో స్నేహంచేసి దాన్ని వశపరచుకుంటే తిరిగి మనసింహాసనాన్ని పొందగల్గుతాం. 
 
మనసే బంధానికీ, జీవితానుభవాలతో ఉన్నతినిచెంది మోక్షసాధనకూ కారణమవుతుంది. మనస్సును సంయమనంతో నిగ్రహించి బ్రహ్మమందు లయం చేస్తే అది బ్రహ్మాకారవృత్తిని పొందుతుంది. జ్ఞాని ఎపుడూ బ్రహ్మాకారవృత్తిలో ఉండటంవల్ల తనకన్నా భిన్నమైన రెండవ వస్తువు గోచరించదు. అందుకే సమస్త వాసనలూ బీజరూపంలో ఉండగానే నశిస్తాయి. ఆత్మజ్ఞానం వల్ల వాసనలు నశించగా మనస్సూ నశిస్తుంది. భూత భవిష్యద్విషయాలపై ఆలోచనలను నిరోధిస్తే చిత్తము నశిస్తుందని విజ్ఞులు చెబుతారు. అప్పుడు వర్తమాన విషయాలయందే ప్రవర్తిస్తుంటాం. అట్లే జ్ఞాని ఎప్పుడూ వర్తమానమందే ప్రవర్తిస్తూ వాటిని క్షణకాలం బాహ్యబుద్ధితో సేవిస్తుంటాడు. అందుకే జ్ఞానికి ప్రారబ్దకర్మలచే క్రొత్త వాసనలూ, కర్మఫలాలూ ఏర్పడవు.

బ్రహ్మచైతన్యాన్ని ఆవరించిన తమోగుణం అనేపొర బ్రహ్మమును ఎరుగనీయక మరుగున ఉంచుతుంది. దాని ఆవరణ ధర్మంవల్ల దేహవాసనతో దేహాత్మభావం కల్గి, తాను బ్రహ్మమనేది తెలియకుండా చేస్తుంది. ఆత్మజ్ఞానం వల్లే ఇది నశిస్తుంది. అనేక అలవాట్లకు, క్షణిక ఆవేశాలకు, ఉద్వేగాలకు లోనయ్యే మనస్సును అదుపులో పెట్టవచ్చు. అదుపు చెయ్యగలిగేది కూటస్థబ్రహ్మమే. మనముందుండే వస్తువును ఎలా చూడగలుగుతున్నామో అలా మన మనస్సులో జరిగే ఆలోచనలను గమనించే వాడొకడు ఉండాలి. ఆ గమనించేవాడే బ్రహ్మము. ఉదాహరణకు మనముందు ఒక కుండ ఉందనుకుందాం. అది తనను తాను చూసుకోలేదు. దాన్ని చూడడానికి ఒక కన్ను అవుసరం. కన్నుతోబాటు చూసేవాడూ కావాలి. అపుడే చూసేవాడు ఆ కుండను కన్నుద్వారా చూడగల్గుతాడు. మన ఎదుటగల వస్తువును చూస్తున్నామంటే మనలో ఎట్టిమార్పులకూ లోనుగాని శాశ్వతమైన తెలుసుకునేవాడు ఉండి తీరాలి. అలాంటి వాడే నిరంతరమూ జీవుని మనస్సులో కలిగే మార్పులను, ప్రేరణలనూ సాక్షిగా వీక్షించేది.

మనస్సుతోనే బ్రహ్మమును తెలిసికోగలం. తన సంకల్పశక్తితో తనకోరిక మేరకు ఆయావిషయాలతో తాదాత్మ్యం చెందేది “నేను” గా చెబుతాం. అదే అంతర్యామిగా ఉండే చైతన్యం. ఇదే స్వాప్నిక అనుభవాలన్నిటినీ ప్రకాశింప జేసేది. మనస్సును జాగరూకతతో గమనిస్తే ఎప్పటికీ నాశనంకాని శాశ్వతమైన, నిర్మలము స్వయంప్రకాశమైన మార్పులేని ఎరుక అనుభవంలోకి వస్తుంది. అసలు ఉన్నది  పరిపూర్ణమైనది ఆ స్వచ్చమైన ఎరుకయే. అదే కూటస్థచైతన్యం. అట్టి దానిపై ధ్యానంచేస్తే దుఃఖం దూరమై మనస్సు ఏకాగ్రమై ప్రశాంతంగా ఉంటుంది. కూటము అంటే కంసాలి ఆభరణాలను చెయ్యడానికి ఉపయోగించే ఇనుపమొద్దు/డాగలి. దీనిపై బంగారాన్ని ఆభరణాలుగా నామ రూపములు మారుతున్నా , ఈ ఇనుప దిమ్మె మాత్రం ఎట్టి మార్పుకూ లోనవ్వక నిర్వికారంగా ఉంటుంది. అందుకే దాన్ని కూటమని అంటారు. అదే విధముగా నిర్వికారమైన ఆత్మకు కూటస్థుడు/కూటస్థమని పేరు.


Thursday, March 21, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-8

మనస్సుయొక్క అవస్థలు –

మానవ శరీరయాత్రలో జాగ్రతు స్వప్నము సుషుప్తి అనే అనుభవాలు కలుగుతుంటాయి. ఇవి మనస్సుచే ఏర్పడ్డవే.  జాగ్రదావస్థ అహంకారం పూర్తిగా వ్యక్తమయ్యే స్థితి. దీన్లో జ్ఞాపకాలు అనే వాసనలు చిదాభాసునితో కలసి బాహ్యప్రపంచంలో వ్యక్తులను, వస్తువులను జ్ఞానేంద్రియాలతో మనకంటే బయట ఉన్నట్లు ఊహించుకుంటాం. ఇలా జాగ్రదావస్థలో ప్రాపంచికజ్ఞానం నిరంతరము కలుగుతూ ఉంటుంది. ఈ అవస్థలో అహంకారం సూక్ష్మశరీరంతోను, స్థూలశరీరంతోను తాదాత్మ్యం చెంది జీవుని వ్యక్తిత్వం పూర్తిగా వ్యక్తమవుతుంది. దీన్లో జీవుడిని విశ్వుడు / వైశ్వానరుడని అంటాం. ఒకోసారి మనం సుషుప్తి స్వప్న జాగ్రదావస్థల మధ్య ఉంటుంటాం. మెలకువలో స్వప్నము, నిద్రలో మెలుకువతోను ఉండటం జరుగుతూంటుంది. అలాంటప్పుడు అహంకారం  పాక్షికంగా స్థూలశరీరంతో తాదాత్మ్యం పొందుతుంది. ఈఅవస్థలు అహంకారానికి సంబంధించినవే కాని శుద్ధచైతన్యానికి సంబంధించినవి కావు. మనకు జాగ్రదావస్థ వాస్తవంగాను స్వప్నావస్థ భ్రాంతిగాను తోస్తుంది.

జాగ్రదావస్థలో సగటు మానవుడు తనప్రపంచాన్ని తనే సృష్టించుకుంటాడు. కాని జ్ఞాని భగవతుని సృష్టిలో ఆనందం అనుభవిస్తూ జీవిస్తుంటాడు.  మనస్సు , అహంకారంతో కూడిన జడమైన స్థూలశరీరమే  ఈ మూడు అవస్థలను, జనన మరణాలను పొందుతోంది. పంచభూతములు జడమైనవి. అలాగే వాటి కార్యమైన స్థూల సూక్ష్మశరీరాలూ జడమైనవే. సూక్ష్మశరీరానికి శుద్ధచైతన్యాన్ని ప్రతిబింబించే గుణము ఉంది. దీని ద్వారా మరొక దాన్ని తెలుసుకొనే వీలుంటుంది గనుక దీన్ని లింగశరీరం అంటారు. లింగము అంటే చిహ్నము. స్థూలశరీరం సూక్ష్మశరీరంతో కలసినపుడు అది చైతన్యవంత మవుతుంది. సూక్ష్మశరీరంనుంచి విడిపోతే జడముగా ఉంటుంది. ఆత్మచైతన్యమే జననమరణాలకు సాక్షిగా ఉండేది. ఎందుకంటే ఆత్మ జన్మించలేదు, మరణించలేదు. అది లేని కాలమేలేదు. 

అహంకారము, ఈ మూడు అవస్థలు, సూక్ష్మ స్థూలశరీరాలు, ప్రపంచమూ ఇలా చూడబడేవన్నీ జడములు. ఈ మూడు అవస్థలూ మనచేత మాయవల్ల అనుభవించ బడుతున్నాయి. జడమైన చూడబడే వాటికీ, చూసే చైతన్యవంతమైన వానికీ మాయచేత విడదీయలేని బంధం ఏర్పడింది. వాస్తవానికి మాయకు అస్తిత్వం లేదు. ఇది కేవలం ప్రాపంచిక అనుభవాలు పొందడానికే. స్వప్నంలో మనస్సు తనకున్న శక్తితో ఏ విషయము, వస్తువూ లేకున్నా ఒక ప్రపంచాన్ని సృష్టించి దాని అనుభవాలను పొందుతుంది. అలాగే జాగ్రదావస్థలోనూ ఈ ప్రపంచం మనస్సుచేతనే కల్పించబడిన దవుతోంది.

స్వప్నావస్థలో – అహంకారం పాక్షికమైన మార్పులు చెందుతుంది. దీన్లో అహంకారం సూక్ష్మశరీరంతో తాదాత్మ్యం చెందుతుంది గాని స్థూల శరీరంతో కాదు. ఇంద్రియాలు నిర్లిప్తమై మనస్సుతో కలసి ఉంటాయి. ఈ దశలో మనస్సే పనిచేస్తుంది. భూమిగాని, సముద్రంగాని, జంతుజాలం మొదలైనవిగాని ఏవీ ఉండవు. మనస్సే జాగ్రదావస్థలో అనుభవాలనుండి వీటిని సృష్టించుకుంటుంది. మనస్సే ఇలా మార్పుచెందుతూ కర్తగాను, విషయముగాను వ్యవహరిస్తూ అదే చూసేదిగాను, చూడబడేది గాను స్వప్నంలో వ్యవహరిస్తుంది.  స్వప్నంలో జీవుడిని తైజసుడు అంటారు. అంటే స్వప్న విషయాలను ప్రకాశింప చేసేవాడు. స్వప్నంలో మనకు అనుభవానికి వచ్చే విషయాలన్నీ ఆత్మ ప్రకాశం వల్లే అనుభవానికి వస్తున్నాయి. దీనివల్ల ఆత్మస్వయం ప్రకాశమని తెలుస్తుంది.  జాగ్రత్తులో మనస్సు బాహ్య విషయాలపై ఆధారపడితే, స్వప్నంలో తనంత తానే జాగ్రదావస్థలోని అనుభవాల ఆధారంగా విషయాలను సృష్టించుకొని ఆనందము లేక దుఖాన్ని పొందుతుంటుంది. మెలకువ రాగానే కలలో అనుభవాలు మాయమవుతాయి. ఐనా అవి పోయాయనే బాధ ఉండదు. ఎందుకంటే అవి వాస్తవం కాదు, కలలో విషయానుభవాలని తెలియడం వల్ల. ఇదే విశ్లేషణ ఆధారంగా బ్రహ్మమును తెలుసుకొంటే జాగ్రత్తులో కన్పించే జగత్తు భ్రమ అని అనుభవమవుతుంది. అపుడు ప్రపంచమే స్వప్నతుల్యం అని అనిపిస్తుంది.  జాగ్రదావస్థ కూడ సుదీర్ఘస్వప్నమే అనిపిస్తుంది. మనస్సులో ఇదివరకే ముద్రించబడిన జ్ఞాపకాలపై చైతన్యము యొక్క ప్రకాశం పడి స్వప్నప్రపంచంగా వ్యక్తమవుతోంది. అంటే స్వప్నం మన వాసనలచేత కల్పించబడుతోంది.

సుషుప్త్యావస్థలో  - అహంకారం లీనమై దేహం అచేతనంగా అవుతుంది. వేదాంతంలో ఈ గాఢనిద్రను అహంకారం తన వ్యవహారాలనుండి తప్పుకున్న స్థితిగా చెప్పబడింది. అహంకారం నాశనం కాదు గాని అది బీజావస్థలో కారణశరీరంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. సూక్ష్మశరీరం స్థూలశరీరంతో కలవక విడిగా ఉంటుంది. అందుకే ప్రాపంచిక వ్యవహారాలన్నీ తాత్కాలికంగా ఆగిపోతాయి. స్థూలశరీరం జడమైనదిగా ఉంటుంది. సుషుప్తిలో రాగద్వేషాలుండవు. మనస్సు దానికి కారణమైన అధిష్టానంలో లీనమై ఉంటుంది. కాని ఆత్మ ఉంటుంది. నిద్రనుంచి లేవగానే నిద్రాసుఖాన్ని అనుభవించేనని తెలుసుకుంటాడు. సుషుప్తి రెండవదే లేని అద్వైతస్థితి. సుఖంగా నిద్రించానని తెలియడం వల్ల ఆత్మచైతన్యం ఎల్లప్పుడూ ఉండేదేనని తెలుస్తుంది. నిద్రపోయాడు అంటే అతడు తన “సత్” లోకి వెళ్ళేడని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ద్వైతమంతా జాగ్రత్ స్వప్నాలలోనే. 

స్వప్నంలో సంఘటనలు మనలను మోహపరుస్తాయి. ఆధ్యాత్మిక సాధనకు స్వప్నదృష్టాంతము , జాగ్రదావస్థ రెండూ మిధ్య అని చెప్పడానికి ఉపయోగ పడుతుంది. జాగ్రదావస్థ లోను స్వప్నావస్థ లోను మనస్సే నేను నీవు, నాది నీది, నావారు పైవారు, సుఖదుఃఖాలు , కులభేదాలు, లింగభేదాలు సృష్టించుకుంటుంది. పరమాత్మ జీవులలో విశ్వుడు , తైజసుడు , ప్రాజ్ఞుడు అనే నామాలతో విలసిల్లుతున్నాడు. విశ్వుడు/ వైశ్వానరునికి కుడి కన్ను , తైజసునికి మనస్సు కంఠ స్థానమునను, ప్రాజ్ఞుడు/ ప్రజ్ఞకు హృదయము వరుసగా జాగ్రత్తు, స్వప్నము, సుషుప్త్యావస్థలలో స్థానములని చెప్పబడింది. సుషుప్తినుండే స్వప్న జాగ్రదావస్థలు ఏర్పడుతాయి.                                





Friday, March 15, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-7

అరిషడ్వర్గాలు
 
మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు. వీటినే అంతరంగంలో ఉండే శత్రువులుగా చెప్పడం విన్నాం కూడ. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మాయయొక్క విక్షేపశక్తి వల్ల అరిషడ్వర్గాలు కలుగుతున్నాయి. ఇవి కారణశరీరమందలి రజోగుణం యొక్క విక్షేపశక్తి వల్ల కల్గి, మనస్సులోనికి వ్యాప్తిచెంది అనేకమైన కర్మలకు, వాటి ఫలాలకూ కారణమవుతున్నాయి. ఇలా మలినమైన ఆలోచనకు అహంకారం తోడై, నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది. అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలని చెప్పబడింది. ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కల్గుతుంది. అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కల్గుతుంది. 

కామము
కామము అంటే కోరిక. ఇదే విషయవాసన. మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవేపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కల్గుతూ అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది. వీటిలో తీరని కోరికలు మరణ సమయానికి మిగిలి ఉండటం వల్ల వాటిని అనుభవించడానికి మరో జన్మను పొందాల్సి వస్తూ , ఇలా జనన మరణ చక్రంలో బంధాన్ని కల్గిస్తున్నాయి. ఈ కోర్కెలు నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆసక్తి సన్నగిల్లుతుంది. వైరాగ్యం కలిగి చివరకు తనే బ్రహ్మమనే అనుభవానికి దోహదమవుతుంది. ఆత్మసాక్షాత్కారం కల్గిన జ్ఞానికిజగత్తంతా బ్రహ్మంగానే గోచరించి కామం పూర్తిగా నశిస్తుంది.

క్రోధము
కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. అట్టి క్రోధంవల్ల అవివేకం కల్గి బుధ్ధి నశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు. కామక్రోధాలు రెండూ నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి.

లోభమోహాలు
మోహం అజ్ఞానలక్షణం. అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహము. శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. అదే దేహవాసన. ఈ మోహం వల్లఫలాపేక్షతో కూడిన కర్మప్రవృత్తి కల్గి బంధానికి కారణమవుతుంది. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు. అంచేత జననమరణాలుండవు. సృష్టి కొనసాగుతోంది అంటే డానికి మొహమే కారణం.
లోభము అనేది తనకు తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది. ఈ రెండూ ఆత్మజ్ఞానం వల్లే నశిస్తాయి.

మదము మాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మదనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.
మానవులంతా ఆత్మస్వరూపులు ఐనపుడు సుఖదుఃఖాలను అనుభవించేది ఒకే ఆత్మచైతన్యం. కర్మఫలాలను బట్టి ఈ వ్యత్యాసాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం వల్లనే ఈ మదమాత్సర్యాలు సన్నగిల్లుతాయి.
ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కల్గుతున్నాయి. ఇవి కారణశరీరం యొక్క రజోగుణ విక్షేపధర్మం వల్ల కల్గుతున్నాయి. కారణశరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం. అరిషడ్వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి. మనోనాశనమే మోక్షమని చెప్పబడింది.
                  


Thursday, March 7, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-6


రాగద్వేషాలు  
 
మనస్సే ఒక ఆలోచన మంచిదని గాని చెడ్డదని గాని రూపకల్పన చేస్తుంది. అందువల్ల బంధము, దుఃఖము కలుగుతున్నాయి. అంతేగాని జ్ఞానేంద్రియాల వల్ల కాదు. ఇలాంటి భేదభావాన్ని మనస్సే సృష్టించుకొంటుంది. అంటే సంకల్పమే సంసారము. సంకల్పం ఉన్నచోట మనస్సు ఉంటుంది. అందుకే వివేకంతో సంకల్పాలను నిర్మూలించి బాహ్య విషయాలనుండి మనస్సును అంతర్ముఖం చెయ్యాలి. మనస్సు మాయయొక్క విక్షేపశక్తివల్ల నామరూపములచే బాహ్యజగత్తును కల్పించుకుంటుంది. ఈ విక్షేపశక్తి జాగ్రదావస్థ స్వప్నావస్థల్లోనే ఉంటుఉంది. సుషుప్తిలో ఉండదు. సంకల్పవికల్పములు, వాసనలు నశిస్తేనే “నేను” అనేది నశించి బంధవిముక్తి కల్గుతుంది. మనస్సు అవిద్యాకార్యం. అజ్ఞానం తొలగితేనే మనోనాశం కల్గుతుంది. అవిద్య అనేది మనస్సు, బుధ్ధి , అహంకారము మొదలైన ఉపాధుల ద్వారానే తన ప్రభావాన్ని చూపుతుంది. చూసేవాడు, చూడబడేది అనే ద్వైతమంతా మనోకల్పనయే. మనస్సును లయింపచేస్తే జగద్భ్రాంతి తొలగుతుంది.

బుద్ధితో కూడిన ఆత్మయే అహంకారము. నేను, నాది అనేదంతా జీవసృష్టి. ఈ జీవసృష్టే బంధానికి కారణం. మనస్సే అహంకారానికి బీజం. లోకవ్యవహారంలో అనుకున్నవి సంభవిస్తే రాగము, ప్రతికూల ఫలితాలు సంభవిస్తే ద్వేషము కల్గుతాయి. రాగము, ద్వేషము, తటస్థంగా ఉండటం అనేవి మనోవృత్తులు. భావావేశాలన్నీ రాగాద్వేషాలే. సుఖ దుఃఖాలు, హర్షశోకాలు, ఉప్పొంగిపోవడం కృంగిపోవడం మొదలైనవి రాగద్వేషాలవల్లనే కలుగుతాయి. కోపం కోరికయొక్క మరోరూపం. కోపము భయము అనేవి రాగము సుఖములతో కలిసే ఉంటాయి. నిద్రలో ఈ రాగద్వేషాలు బీజరూపంలో ఉండి నిద్రనుంచి మేల్కొగానే తిరిగి ప్రత్యక్షమవుతాయి. మనస్సు కల్పించే భేదభావన తొలగితే రాగద్వేషాలు కలుగవు. ఇవి సంకల్పములు కనుక కర్మ చెయ్యడానికి ప్రేరేపించి బంధానికి కారణమవుతాయి.

ప్రకృతి గ్రుడ్డిది. ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది. సంతోషంగాని దుఃఖంగాని వస్తువులలోనో లేక విషయాలలోనో ఉండదు. వాటిపై మనకుండే మమకారంవల్ల సుఖదుఃఖాలు, రాగద్వేషాలు కల్గుతున్నాయి. మనం సంతోషంగా ఉన్నపుడే ప్రాపంచిక విషయాలు ఆకర్షిస్తాయి. తీవ్రమైన దుఃఖంలో మనస్సు ఆ విషయాలవైపుకు పోదు. ఇష్టాయిష్టాలనేవి మనస్సులో తరంగాలుగా ఏర్పడుతుంటాయి. తిరిగి అవి మనస్సులోనే లీనమవుతుంటాయి. ఇవి ఏర్పడటానికి కారణం ఏమీ ఉండదు. సరైన అవగాహన, ఎరుక కలిగి ఉంటే వీటిని నిశితంగా గమనించ గల్గుతాం. ఒక వస్తువుగాని విషయంగాని దాన్ని చూసే వ్యక్తియొక్క ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్త్రీని బిడ్డ మాతృమూర్తిగా చూస్తే,  భర్త తనకు సుఖాన్నిచ్చే వ్యక్తిగా భార్య స్థానంలో చూస్తాడు. అదే స్త్రీని ఒక క్రూరమృగం తనకు ఆహారంగా చూస్తుంది. ఇలాంటి భేదభావాన్నికలిగించేది బుధ్ధి. ఇలా చూసేదృక్పధాన్ని బట్టి ఆలోచనా సరళి మలినమవ్వడం జరుగుతూంది.

లోకవ్యవహారానికీ , ఆధ్యాత్మికజీవనానికీ మధ్య ఆలోచనే వారధిగా మనలను ప్రేరేపించేది. ప్రాపంచిక విషయాలకై ప్రాకులాడటమా లేక ఆధ్యాత్మిక అనుభవాలకు మన హృదయపు తలుపులను తెరచి ఉంచుతామా అనేది మన యిష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. సాత్వికమైన మనస్సు ఆధ్యాత్మికత వేపు మొగ్గు చూపుతుంది. నిజమైన ఆనందం నీలోనే ఉంది. బాహ్య విషయాల్లోనో వస్తువుల్లోనో కాదు. ఆత్మయే ఆనందానికి మూలం. వైరాగ్యం లేని సాధన నిష్ప్రయోజనమని చెబుతారు.